'చిత్రసీమలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయాక నటీనటుల్లో బద్ధకం పెరిగిపోయింది. ఎక్కడైనా అనుకున్నది అనుకున్నట్లు రాకుంటే గ్రాఫిక్స్లో మేనేజ్ చేసెయ్యొచ్చులే అని తేలికగా తీసుకుంటున్నారు. ఒకప్పుడు కెమెరామెన్ ఫ్రేం సెట్ చేస్తే మరొకరు అందులో వేలు పెట్టేవారు కాదు. కానీ, ఇప్పుడు కాస్ట్యూమ్ డైరెక్టర్ నుంచి ఆర్ట్ డైరెక్టర్ వరకు ప్రతిఒక్కరూ ఫ్రేంలో వేలు పెట్టేస్తున్నారు. ఇక నెట్ఫ్లిక్స్ వంటి డిజిటల్ మీడియా ఫ్లాట్ఫాంలు వచ్చాక కొత్త ట్రెండ్ మొదలైంది. వాళ్లు సిరీస్లు చిత్రీకరించే సమయంలో పర్ఫెక్షన్ కోసం మేకప్ నుంచి కళా దర్శకుడి వరకు ప్రతిఒక్కరికీ ఓ మోనిటర్ ఇచ్చేసి వాళ్ల వాళ్ల విభాగాలు చక్కగా కనిపిస్తున్నాయో లేదో చూసుకోమంటున్నారు. కెమెరామెన్లకు ఇది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే. కానీ, మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా మనం మన పనిలో మరింత నైపుణ్యం పెంచుకుంటూ ముందుకెళ్లాలి. ఓ కెమెరామెన్గా నన్ను నేను అప్డేట్ చేసుకోవడానికి రెండు పనులు చేస్తుంటా. ఏటా సినిమాటోగ్రఫీ విభాగంలో ఆస్కార్ పురస్కారాలకు ఓ ఐదారు చిత్రాలు నామినేట్ అవుతుంటాయి. అవి చాలు నా పరిజ్ఞానం పెంచుకోవడానికి'' అని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు అన్నారు. తాజాగా ఆయన 'రాజుగారి గది 3' చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. అశ్విన్బాబు, అవికాగోర్ జంటగా నటించారు. ఈనెల 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో మంగళవారం విలేకర్లతో ముచ్చటించారు.
* కెమెరామెన్లు డైరెక్టర్లుగా మారడం హాలీవుడ్లో ఉంది. అక్కడ 60 ఏళ్ళ వచ్చాక ప్రతిభను కనబరుస్తారు. నా దృష్టిలో దర్శకత్వం చాలా కష్టమైన పని. ఇక నాకున్న టెంపర్కి డైరెక్షన్ అన్నది ఇప్పట్లో అయ్యే పనికాదు. కాబట్టి నేనొక సినిమా తీస్తే ఆ అంచనాలు అందుకునేలా మంచి కథ దొరకాలి. ఒకవేళ వీటన్నింటికీ తగ్గట్లుగా పరిస్థితులు అనుకూలిస్తే.. 80ఏళ్ల తర్వాత దర్శకుడిగా మారతానేమో.
* 'నాకందరూ కోపం ఎక్కువ అంటుంటారు. నా తత్వం అంతే. నిజానికి అది నాకు పని మీదున్న ప్రేమలో నుంచి పుట్టుకొచ్చింది. చాలామంది కొత్త దర్శకులు నా పేరు విని కథ చెప్పడానికి భయపడి వెనక్కు వెళ్లిపోయిన వాళ్లు ఉన్నారు. 'ఠాగూర్' చిత్రానికి నేను కెమెరామెన్ అని వినాయక్కు చిరంజీవి సర్ నా పేరు చెప్పినప్పుడు ఆయన కూడా ఇలాగే భయపడ్డారట. కానీ, రెండు రోజులు చిత్రీకరణ జరిగాక.. తను నా దగ్గరకు వచ్చి 'మీరు నీళ్లలాంటి వారు సర్' ఎవరితోనైనా ఇట్లే కలిసిపోతారు అని చెప్పారు''.
* కొత్తగా వస్తున్న ఛాయాగ్రాహకుల మేకింగ్ స్టైల్ను ఫాలో అవుతుంటా. ఏదైనా సినిమా నచ్చితే ఆ చిత్ర కెమెరామెన్ను పిలిచి 'ఈ షాట్ ఎలా తీశావ్' అని అడిగి మరీ తెలుసుకుంటా. ఈ విషయంలో నేనెప్పుడూ సిగ్గుపడను. ఇటీవల కాలంలో 'జెస్సీ' అనే చిత్రం చూశా. అందులో కొన్ని నైట్ ఎఫెక్ట్ షాట్స్ చూసి నాకే చాలా సిగ్గనిపించింది. ఇప్పటి వరకు నాకెందుకు ఇలా తియ్యాలనిపించలేదు అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఆ చిత్రానికి పనిచేసిన కెమెరామెన్ సునీల్ను తర్వాత కలిసి ఆ సీన్స్ను ఎలా చిత్రీకరించింది అడిగి తెలుసుకున్నా. 'కేరాఫ్ కంచరపాలెం' చూశాక దర్శకుడు వెంకటేష్ మహాతోనూ ఇలాగే మాట్లాడి.. ఆ చిత్ర విశేషాలు తెలుసుకున్నా. నాకు సినిమాలు తప్ప మరేమీ తెలియవు. నా తుది శ్వాస వరకు ఇక్కడే పని చేసుండాలని కోరుకుంటా.
* ''నేనిప్పటి ఎన్నో జోనర్లలో చేశాను కానీ, హారర్ కామెడీ చిత్రానికి ఎప్పుడూ పని చేయలేదు. ఆ కోరిక 'రాజుగారి గది3'తో తీరింది. ఓంకార్ నాకు 'స్టాలిన్' చిత్ర సమయం నుంచి తెలుసు. అప్పుడే తన ప్రతిభ చూసి ఓ గొప్ప స్థాయికి వెళ్తాడనిపించింది. తన తొలి చిత్రం 'జీనియస్' కథను ముందు నాకే చెప్పాడు. విన్నప్పుడే కథ అద్భుతంగా అనిపించింది.. కానీ, అప్పుడు తనతో చేయడం కుదరలేదు. నిజానికి 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' తర్వాత నేను రాత్రిళ్లు చిత్రీకరణలకు వెళ్లట్లేదు. కానీ, ఓంకార్ ఈ కథ చెప్పాక నైట్ చిత్రీకరణ ఓకే అన్నా. ఈ సినిమా పూర్తిగా నైట్ ఎఫెక్ట్లోనే సాగుతుంది.
నటీనటుల్లో బద్ధకం పెరిగిపోయింది - ఛోటా కె.నాయుడు
